Skip to main content

జీవన మకరందం

కొందరిని చూస్తుంటే- ఎప్పుడూ నవ్వుతూ హాయిగా ఆనందంగా కనిపిస్తారు. మరికొందరిని చూస్తే నిత్యం దుఃఖం ఓడుతూ ఉంటారు. 'నువ్వు ఆనందస్వరూపుడివి...' అంటుంది వేదాంతం. కాదు పొమ్మంటుంది- వాస్తవ జీవితం! ఈ వ్యత్యాసానికి మూలాలు కనుగొనాలని మనిషి ఎంతోకాలంగా ప్రయాసపడుతూనే ఉన్నాడు. ఆనందంకోసం అన్వేషణ సాగిస్తూనే ఉన్నాడు. దాని నిజస్వరూపం బోధపడక, స్వేచ్ఛగా విలాసంగా గడపడమే- ఆనందం అని మనిషి పొరపడటం మనం ఈనాడు చూస్తున్నాం. సుఖమూ, సంతోషమూ, ఆనందమూ అనేవి నిజానికి వేరువేరు. ఈ మూడూ ఒకటేనని మనిషి పొరపడుతుంటాడు. సుఖం అనేది ఇంద్రియ, లేదా శారీరక సంతృప్తిని వ్యక్తం చేసే పదం. ఎండలో తిరిగినవాడు చల్లని నీడలోకి రాగానే శరీరానికి సుఖంగా అనిపిస్తుంది. సంతోషమనేది మనసుకు కలిగేది. మంచి సమాచారం విన్నప్పుడో, ఏదైనా బాగా కలిసొచ్చినప్పుడో మనసు ఉత్తేజమవుతుంది. మనసుకు సంతోషం కలిగినప్పుడు శరీరం కూడా చురుగ్గా, ఉల్లాసంగా ఉంటుంది. ఈ రెండింటికన్నా ఉన్నతమైనది, ఉదాత్తమైనది- ఆనందం. శారీరక మానసిక ఆధ్యాత్మిక కక్ష్యలు మూడింటికీ సంతృప్తిని కూర్చే ఒకానొక గొప్ప స్థితిపేరు ఆనందం. ఆత్మకు సంతృప్తిని కలిగించే పనులను చక్కబెట్టినవారికి- ఆనందమయ స్థితి వరంగా లభిస్తుంది. 'ఆత్మలోని అంతర్గత శక్తిమూలంగా ఆనందం ప్రభవిస్తుంది'- అన్నాడు మార్కస్‌ అరిలియస్‌. 'ఆనందం తన సహజసిద్ధమైన స్వభావమని మనిషి మరిచిపోవడమే జీవితంలో విషాదానికి కారణం' అన్నాడాయన. ఆనందాన్ని మనిషి స్వయంగా అనుభవించవలసి ఉండగా- 'దాన్ని ఇతరుల కళ్ళ ద్వారా చూడాలనుకోవడం అవివేకం' అన్నాడు షేక్‌స్పియర్‌. లోకంలో ఎక్కడ చూసినా ఈ రకమైన వివేక రాహిత్యమే ప్రస్తుతం రాజ్యమేలుతోంది.
ఇంద్రియ సుఖాలనే- ఆనందానుభూతులుగా మభ్యపెట్టాలని అల్లసాని 


పెద్దన్నగారి వరూధిని తీవ్రయత్నం చేసింది. శారీరకమైన సౌఖ్యాలకీ, 


ఆత్మగతమైన ఆనందానికీ వ్యత్యాసం బాగా తెలిసినవాడు కనుక ప్రవరుడు 


ఆమె కోరికను నిస్సంకోచంగా తిరస్కరించాడు. ఆత్మ సాంగత్యంతో 


ప్రమేయంలేని ఇంద్రియాలది ఆనందంకాదు- అర్థంలేని సుఖం! పట్టుతేనె 


రుచి తెలిసినవాడు శాక్రిన్‌ తీపికి మోజుపడడు. ఆనందం విలువ తెలిసినవాడు 


కేవల ఇంద్రియ సుఖాలకు వెంపర్లాడడు. ప్రవరుడి వైఖరిలోని ఈ కాఠిన్యాన్ని 


అర్థం చేసుకోవాలంటే- మహాత్మాగాంధీ మాటల్ని జాగ్రత్తగా గమనించాలి. 


'ఆనందమనేది ఏమేమి పొందామన్నదానికన్నా- ఏమేమి 


వదులుకోగలిగామన్నదానిపై ఎక్కువగా ఆధారపడుతుంది' అన్నారాయన. 


ప్రవరుడు వదులుకున్నది సుఖం, పొందింది ఆనందం! మనం ఏవేవో ఖరీదైన 


వస్తువులు కొని తెచ్చి, ఇంటినిండా పేర్చి, వాటికి యజమానులం 


అయ్యామని సంతోషిస్తాంగాని, వాటికి బానిసలం అవుతున్నాం అనేదే- 


చేదునిజం. ఈ సత్యం బోధపడితే మనిషికి దుఃఖంనుంచి సంతోషం మీదుగా 


ఆనందంవైపు ప్రయాణం చెయ్యడం సులభమవుతుంది. జీవితం అనేది 


మనిషికి లభించిన బహుమతి, ఆనందమనేది సాధించవలసిన బహుమతి. 


ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేవారు, హాస్యసన్నివేశాలు చూసి ఆనందంతో 


హాయిగా నవ్వుకునేవారి శరీరాల్లో 'ఇంటర్‌ ఫెరాన్‌గామా' అనే రసాయనం 


ఉత్పత్తి అవుతుందని శాస్త్రజ్ఞులు గుర్తించారు. మనిషి అనారోగ్య లక్షణాలను 


దూరంచేసే రసాయనమది. మనిషి ఆనందమయస్థితిలో ఉన్నప్పుడు 


మానసిక, శారీరక సమతౌల్యం ఏర్పడుతున్న విషయమూ రుజువైంది.


మానవ జన్యువులపై పరిశోధన చేసినవారు- జన్యుపరంగా చూస్తే మానవుడి ఏకైక విధి సంతానోత్పత్తిగా తేల్చిచెప్పారు. సంతానోత్పత్తి వయసు దాటిపోగానే జన్యువులు బలహీనపడటం మొదలవుతుంది. క్రమంగా శరీరనిర్వహణ విధులు నిర్వహించే జన్యువులు నీరసపడతాయి. వ్యాధులు దేహాన్ని చుట్టుముడతాయి. ఒకరకంగా మనం చనిపోవడం లేదు- జన్యువుల చేతిలో హత్యకు గురవుతున్నాం.. అని న్యూక్యాజిల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన మెడిసిన్‌ ప్రొఫెసర్‌ టామ్‌కిర్క్‌వుడ్‌ మూడేళ్ళక్రితమే ప్రకటించారు. అదే జన్యువుల పాత్రను మరో కొత్తకోణంలోంచి విశ్లేషిస్తూ- మనిషిలో ఆనందానికి కారణం జన్యువులేనని ఎడింబరో విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞులు కొత్తగా ప్రకటించారు. 'బాహ్యప్రపంచంలోని పరిస్థితుల కారణంగా మనిషి ఆనందంగా ఉంటాడని అందరం అనుకుంటాం. నిరంతరం ఆనందంగా ఉండటంలో జన్యువుల పాత్ర ఎంతో అధిక'మని పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్‌ అలెగ్జాండర్‌ విస్‌ అంటున్నారు. వాళ్ళ జీవితాల్లో కష్టాలు లేవనుకుంటే పొరపాటు అంటున్నారాయన. ఆనందమయ స్థితిని అందుకొన్న అదృష్టవంతుల జీవితాల్లోనూ కష్టాలుంటాయి, వేదన ఉండదు. వారి జీవితాల్లోనూ శ్రమ ఉంటుంది, అలసట ఉండదు. ఆటుపోట్లు ఉంటాయి, కుంగిపోవడం ఉండదు. చైతన్యగతమైన ఆనందం- మానవ శరీరానికి ఇచ్చే గొప్ప కానుక ఇది. మొత్తం 900 మందిని పరిశీలించగా ఈ తరహా వ్యక్తిత్వం కలిగిన అందరి శరీరాల్లోనూ ఒకే రకమైన జన్యునిర్మాణం ఉన్నట్లు డాక్టర్‌ అలెగ్జాండర్‌ గుర్తించారు. జన్యువుల ఏకైక విధి సంతానోత్పత్తి అయినప్పుడు- ఆనందన్నిచ్చే జన్యువులకు ఆ లక్షణం ఎక్కడినుంచి వచ్చింది? ఆ జన్యువుల పుట్టుకకు కారణమైన ఆనందమయస్థితిలోని మనిషినుంచి! ఆ మనిషి జీవలక్షణాలు జన్యువుల్లో నిక్షిప్తమైందన్న మాట. తియ్య మామిడి కావాలనుకుంటే- బంగినపల్లి టెంకలను నాటుకుంటేనే కదా సాధ్యమయ్యేది. వేపవిత్తులు నాటితే చెరకుగడలు మొలవవు. నిత్యం దుఃఖంలో నానుతూ ఉండే మనిషి ఆనందాన్ని పంచలేడు. నిరంతరం ఆనందంగా ఉన్నవాడు మాత్రమే చుట్టూ ఉండేవారికి, తరవాతి తరానికి సైతం తన జీవలక్షణమైన ఆనందాన్ని అందించగలడు. ఎవరైనా తమ దగ్గర ఉన్నదే ఇవ్వగలరు!
(ఈనాడు, సంపాదకీయం, 16:03:2008)

Comments

Popular posts from this blog

Tips for employees(In telugu)

(From Eenadu Sunday special  17/07/11)

వేమన పద్యాలు

అంతరంగమందు నపరాధములు చేసి మంచివానివలెనె మనుజుడుండు ఇతరు లెఱుగకున్న నీశ్వరుడెఱుగడా? విశ్వదాభిరామ వినురవేమ. *********************************************** అంతరాత్మగనక యల్పబుధ్ధులతోడ మెలగెడు జనులెల్ల మేదినిపయి యముని నరకమునకు నరుగంగ సాక్ష్యము విశ్వదాభిరామ వినురవేమ. *********************************************** అధికుడైన రా జొకల్పుని జేపట్ట వానిమాట చెల్లు వసుధలోన గణకు లొప్పియున్న గవ్వలు చెల్లవా? విశ్వదాభిరామ వినురవేమ. *********************************************** తల్లిబిడ్డలకును తగవు పుట్టించెడి ధనము సుఖము గూర్చునని గడింత్రు కాని యెల్లయెడల ఘన దుఃఖన్‌దమది విశ్వదాభిరామ వినుర వేమ! తాత్పర్యము: ధనం వల్ల సుఖం పొందవచ్చని అందరూ పిచ్చిగా సంపాదిస్తూంటారు. అధికమైన సొమ్ము ఎప్పటికైనా దూఃఖాన్నే కలిగిస్తుంది. సంపాదించిన సొమ్మును కాపాడుకోవాలనే అశాంతితోనే అల్లాడుతూంటారు. అత్యంత ప్రేమానురాగాల్లొ ఉండే తల్లికి పిల్లలకు మధ్య కూడా ధనం విరోధం తెస్తుంది *********************************************** నిండునదులు పారు నిలచిగంభీరమై వెఱ్ఱివాగు పాఱు వేగబొర్లి అల్పుడాడురీతి నధిక...

10,000hours

గొప్పవారు కావాలని కలలు కనేది ఎందరో... అది నేరవేరేది కొందరికే ఎందుకు?   ఆ రహస్యాన్ని ఛేదించారు జర్మన్‌ పరిశోధకులు.  ఏదో ఒక రంగంలో గొప్ప అవ్వాలని ప్రతి మదిలో రగులుతుంటుంది. అసలు లోపం మాత్రం కష్టపడడంలోనే. ఎంచుకున్న రంగంలో దాదాపు 10,000 గంటలు కృషిచేస్తే అనుకున్న లక్ష్యం సాధించగలం. పరిశోధకుల పరిశీలన ప్రకారం 10,000 గంటలు శ్రమిస్తే విజయం ఎలాంటి వారినైనా వరించి తీరుతుంది. తెలివితేటలు, అదృష్టం అనేవి జీవితంలో చాలా ముఖ్యమైనవైనా సాధన మాత్రమే తెలివిని, మన సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియచేస్తుందని ఈ పరిశోధనల సారాంశం.  దీన్ని రుజువు చేయడానికి పరిశోధకులు బెర్లిన్‌ సంగీత అకాడమీని తమ కేంద్రంగా ఎంచుకున్నారు. అక్కడ రోజూ ఎంతో మంది వయొలిన్‌ నేర్చుకుంటుంటారు. అయితే ఐదేళ్ల చిన్నారుల రోజువారీ సాధనను నమోదు చేసేవారు. మొదట్లో రెండు నుంచి మూడు గంటలు... వయసు పెరుగుతున్న కొద్దీ సాధన పెరిగింది. 20 సంవత్సరాలకు వచ్చేసరికి అత్యుత్తమ స్థాయి విద్యార్థుల సాధన 10,000 గంటలకు చేరింది. కొందరు 8,000 గంటల సాధనతో మంచి విద్యార్థులుగా పేరు తెచ్చుకున్నారు. ఇదంతా పరిశీలించి మెదడు తనకు కావాల్సిన విషయాలను నేర్చుకోడానికి,...