Skip to main content

సాధనే సాఫల్యం


చేతినిండా పని, మనసునిండా తగిన ఆలోచనలు... ఈ రెండూ మనిషి ప్రగతి రథానికి రెండు చక్రాలు. పనిలేకపోవడం వలన నిరాసక్తత ఏర్పడుతుంది. అలాంటివారిలో నిర్లిప్తత చోటు చేసుకుంటుంది. ఆ నిర్లిప్తత వల్ల ఎన్నో అనర్థాలు. అందుకే 'పనిలేనివాడి బుర్ర దయ్యాల నిలయం' అనే నానుడి పుట్టింది.


ఎల్లప్పుడూ పని చెయ్యడానికి అలవాటు పడిన శరీరం చురుకుగా ఉంటుంది. మెదడూ ఉత్సాహం పుంజుకొంటుంది. శరీరాన్ని శ్రమ పెట్టకుండా సుఖాలు కల్పిద్దామని విశ్రాంతినిచ్చామో... శరీరం, మనసు రెండూ రోగగ్రస్తం కావడం మొదలు పెడతాయి.

చైతన్యపురంలో కృషీవలుడు అనే రైతు ఉండేవాడు. అతడికి ఉన్నది కొద్దిపాటి భూమి. అందులోనే నిరంతర కృషితో అత్యధిక ఫలసాయం పొందుతూ ఉండేవాడు. అతడు విశ్రాంతిగా ఒక్కరోజైనా కూర్చునేవాడు కాదు.

ఒకసారి అతడు పొలం దున్నుతూ ఉండగా అటు వెళుతున్న ఆ ప్రాంత జమీందారు చూశాడు.

అది నడివేసవి కాలం. కృషీవలుడి గురించి, అతడి విజయాల గురించి అంతకుముందే విన్నాడతను. ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ఎన్నాళ్ళనుంచో అనుకుంటున్నాడు. ఇన్నాళ్ళకు ఇలా అవకాశం దొరికింది అనుకుంటూ- బండి ఆపించి దిగి అతడి దగ్గరకు వెళ్ళాడు.

పరస్పర పరిచయాలు అయ్యాక 'ఇంత ఎండలో పనిచెయ్యకపోతేనేం?... ఇది పంట పండే కాలం కూడా కాదాయె. ఇప్పుడెందు కింత శ్రమపడి పనిచెయ్యడం?' అన్నాడు జమీందారు.

ఆ మాటకు జవాబుగా కృషీవలుడు 'పండే కాలం కాదని మనం అనుకుంటున్నాం. భూమికి మాత్రం ఖాళీగా ఉండటం తెలియదు... దానికి తెలిసిందల్లా ఏదో ఒక మొక్కను తనలో నుంచి మొలిపించి పెంచడమే... నేను ఈ రోజు దున్నకపోయినా, విత్తులు వేయకపోయినా భూమి మాత్రం తనపని తాను చేసుకుపోతుంది. తన గర్భంలోనే ఇదివరకటి నుంచి ఉన్న ఏ రకమైన విత్తులనైనా మొలిపిస్తుంది. అలా జరిగితే నేను నిజంగా పంట వేసేవేళకు ఆ కలుపు మొక్కలతో ఎన్నో అవస్థలు పడవలసి వస్తుంది. ఆ పొలంలాంటిదే ఈ శరీరమూ... దీనికి పని చెప్పకుండా ఖాళీగా ఉంచితే ఏవో సుఖాలు కోరుతుంది. ఆలోచనలు చెయ్యడమే సహజ గుణమైన మెదడు సైతం అనేకమైన ఇతర ఆలోచనలు చేస్తుంది. ఫలితంగా పనిచెయ్యకుండా వదిలిన పొలంలో కలుపు మొక్కలు పెరిగినట్లే నా మనోక్షేత్రంలోనూ అనవసరమైన ఆలోచనలు సాగవుతాయి. శరీరానికీ, మనసుకూ హాని చేసే ఆలోచనలు నన్ను ఎటు తీసుకెళతాయో తెలియదు. అందుకే ఈ పొలానికి కలుపు మొక్కలు పెరిగే ఆస్కారం, మనసుకు చెడు తలపులు కలిగే ఆస్కారం ఇవ్వకుండా ఈ భూమిని మెత్తగా దున్నుతున్నాను. దీనివల్ల రాబోయే వర్షకాలంలో నా పనులు అతి సులువుగా జరగడానికి ఆస్కారం ఉంటుంది' అన్నాడు. కాబట్టి- ఏ రంగంలోనైనా నైపుణ్యం సాధించాలంటే నిరంతర కృషి, పరిశ్రమ ఉండాలి. ఉన్నత స్థానానికి ఎదిగేవారి విజయరహస్యం ఇదే.

అందరికీ బయటకు కనిపించేది- ఎదుటివారి విజయపరంపరే. బయటకు కనబడని అంశాలు- వారి నిరంతర శ్రమ, సాధన.
పియానో వాద్యంలో ప్రపంచ ప్రసిధ్ధి పొందినవాడు పడెర్విస్కీ. అతడు కచేరీ ముగిశాక విశ్రాంతి తీసుకోకుండా మళ్ళీ కనీసం అయిదు గంటలు సాధన చేస్తూండేవాడు. అది చూసిన మిత్రుడొకడు 'నువ్వు ఇంత చక్కగా కచేరీ చేస్తున్నావు. అదీ కాక ఇంచుమించు ప్రతిరోజూ కచేరీ ఉంటూనే ఉంది. అయినా ఇంకా సాధన ఎందుకు?' అని అడిగాడు.

ఆ మాట విన్న పడెర్విస్కీ 'నేను ఒక్కరోజు సాధన చెయ్యకపోతే నా సంగీత సామర్థ్యం తగ్గిపోయిందని నాకు తెలిసిపోతుంది. రెండు రోజులు సాధన చెయ్యకపోతే తోటి విద్వాంసులు గుర్తించేస్తారు. వరసగా మూడు రోజులు సాధన చెయ్యకపోతే, నా సంగీత అభిమానులంతా నా సామర్థ్యం తగ్గినట్లు గుర్తిస్తారు. కళ పట్టుబడటం ఒకెత్తు. దాన్ని నిలబెట్టుకోవడం మరొకెత్తు. ఈ రెండింటికీ నిరంతర పరిశ్రమే ప్రధానం. అది లేకపోతే మనసు ఖాళీగా కూర్చోదు. మరొక పనిలో పడుతుంది. అప్పుడు అసలు పని సరిగ్గా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ స్థితి మనం కోరి తెచ్చుకోకూడదు. దానికోసం నిరంతరం సాధన, కృషి చేస్తూనే ఉండాలి. సాధనతోనే సాఫల్యం కలుగుతుంది' అన్నాడు.

- అయ్యగారి శ్రీనివాసరావు(EEnadu)

Comments

Popular posts from this blog

Tips for employees(In telugu)

(From Eenadu Sunday special  17/07/11)

వేమన పద్యాలు

అంతరంగమందు నపరాధములు చేసి మంచివానివలెనె మనుజుడుండు ఇతరు లెఱుగకున్న నీశ్వరుడెఱుగడా? విశ్వదాభిరామ వినురవేమ. *********************************************** అంతరాత్మగనక యల్పబుధ్ధులతోడ మెలగెడు జనులెల్ల మేదినిపయి యముని నరకమునకు నరుగంగ సాక్ష్యము విశ్వదాభిరామ వినురవేమ. *********************************************** అధికుడైన రా జొకల్పుని జేపట్ట వానిమాట చెల్లు వసుధలోన గణకు లొప్పియున్న గవ్వలు చెల్లవా? విశ్వదాభిరామ వినురవేమ. *********************************************** తల్లిబిడ్డలకును తగవు పుట్టించెడి ధనము సుఖము గూర్చునని గడింత్రు కాని యెల్లయెడల ఘన దుఃఖన్‌దమది విశ్వదాభిరామ వినుర వేమ! తాత్పర్యము: ధనం వల్ల సుఖం పొందవచ్చని అందరూ పిచ్చిగా సంపాదిస్తూంటారు. అధికమైన సొమ్ము ఎప్పటికైనా దూఃఖాన్నే కలిగిస్తుంది. సంపాదించిన సొమ్మును కాపాడుకోవాలనే అశాంతితోనే అల్లాడుతూంటారు. అత్యంత ప్రేమానురాగాల్లొ ఉండే తల్లికి పిల్లలకు మధ్య కూడా ధనం విరోధం తెస్తుంది *********************************************** నిండునదులు పారు నిలచిగంభీరమై వెఱ్ఱివాగు పాఱు వేగబొర్లి అల్పుడాడురీతి నధిక...

10,000hours

గొప్పవారు కావాలని కలలు కనేది ఎందరో... అది నేరవేరేది కొందరికే ఎందుకు?   ఆ రహస్యాన్ని ఛేదించారు జర్మన్‌ పరిశోధకులు.  ఏదో ఒక రంగంలో గొప్ప అవ్వాలని ప్రతి మదిలో రగులుతుంటుంది. అసలు లోపం మాత్రం కష్టపడడంలోనే. ఎంచుకున్న రంగంలో దాదాపు 10,000 గంటలు కృషిచేస్తే అనుకున్న లక్ష్యం సాధించగలం. పరిశోధకుల పరిశీలన ప్రకారం 10,000 గంటలు శ్రమిస్తే విజయం ఎలాంటి వారినైనా వరించి తీరుతుంది. తెలివితేటలు, అదృష్టం అనేవి జీవితంలో చాలా ముఖ్యమైనవైనా సాధన మాత్రమే తెలివిని, మన సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియచేస్తుందని ఈ పరిశోధనల సారాంశం.  దీన్ని రుజువు చేయడానికి పరిశోధకులు బెర్లిన్‌ సంగీత అకాడమీని తమ కేంద్రంగా ఎంచుకున్నారు. అక్కడ రోజూ ఎంతో మంది వయొలిన్‌ నేర్చుకుంటుంటారు. అయితే ఐదేళ్ల చిన్నారుల రోజువారీ సాధనను నమోదు చేసేవారు. మొదట్లో రెండు నుంచి మూడు గంటలు... వయసు పెరుగుతున్న కొద్దీ సాధన పెరిగింది. 20 సంవత్సరాలకు వచ్చేసరికి అత్యుత్తమ స్థాయి విద్యార్థుల సాధన 10,000 గంటలకు చేరింది. కొందరు 8,000 గంటల సాధనతో మంచి విద్యార్థులుగా పేరు తెచ్చుకున్నారు. ఇదంతా పరిశీలించి మెదడు తనకు కావాల్సిన విషయాలను నేర్చుకోడానికి,...